ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అనారోగ్యంతో బాధ పడుతున్న వ్యక్తిని బతికి ఉండగానే కుటుంబం శ్మశానవాటికలో వదిలి వెళ్లిన ఘటన జగిత్యాలలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం పట్టణంలోని మంచినీళ్లబావి ప్రాంతానికి చెందిన ఎండ్రికాయల శ్రీధర్ కు భార్య సునీత, ఇద్దరు కూతుళ్లున్నారు. ఉపాధి కోసం అయిదేళ్ల కిందట సౌదీ అరేబియా వెళ్లిన శ్రీధర్ ఓ కంపెనీలో పని చేసేవారు. వేతనం ఎక్కువే ఉన్నా జల్సాలకు అలవాటు పడి కుటుంబ సభ్యులను పట్టించుకోవడం మానేశారు. ఇక్కడ సునీత కూలీ పని చేస్తూ పిల్లలను పోషించారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన శ్రీధర్ ను కంపెనీ స్వదేశానికి పంపింది. ఇంటికి వచ్చాక ఆయనకు కుటుంబ సభ్యులు స్థానికంగా వైద్యం అందించారు. మూత్రపిండాలు దెబ్బతిని తీవ్ర అనారోగ్యానికి గురైన శ్రీధర్ ను కుటుంబసభ్యులు గురువారం రాత్రి పట్టణంలోని చింతకుంట శ్మశానవాటికలో వదిలివెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం అటువైపుగా వెళ్లిన వారు గమనించి 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి అంబులెన్స్ లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. సోదరుడు, భార్య తనను పట్టించుకోవడం లేదని శ్రీధర్ చెబుతున్నారు. కాగా శ్రీధర్ భార్యా పిల్లల పోషణను పట్టించుకోవడం లేదని, దీంతో వారు గాంధీనగర్లోని సునీత పుట్టింటికి వెళ్లారని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం శ్రీధర్ కు జిల్లా ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Admin
E Nivas News