ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో / కొండపర్తి ప్రసన్నకుమార్ : ముగ్గుల పోటీలు భారతీయ మహిళల సృజనాత్మక నిలువెత్తున నిదర్శనమని మెదక్ జిల్లా ఏఎస్పీ మహేందర్ అన్నారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరయ్, ఆ లైవ్ కార్యక్రమంలో భాగంగా రేగోడ్ మండలం చౌదరిపల్లి గ్రామంలో బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించగా ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం అదనపు ఎస్పీ మాట్లాడుతూ ముగ్గులు భారతీయ మహిళల సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. ఇంటి ముందర వేసే ప్రతి ముగ్గు కేవలం అలంకరణ మాత్రమే కాకుండా, మన సంస్కృతి, విలువలు, ఆచారాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం, సీట్బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం (డ్రంక్ అండ్ డ్రైవ్), అతివేగాన్ని నివారించడం, రోడ్డు పై ఉన్న ట్రాఫిక్ సూచికలను గమనిస్తూ నిబంధనలను కచ్చితంగా పాటిస్తే అనేక ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులే అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారని అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ను తప్పనిసరిగా అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. గ్రామస్థులు, ముఖ్యంగా మహిళలు ఇలాంటి అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం అభినందనీయమని అదనపు ఎస్పీ అన్నారు. రోడ్డు ప్రమాదాలు కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగులుస్తాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సూచించారు. పోలీస్ శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే రోడ్డు ప్రమాదాలనివారణ సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రేగోడ్ ఎస్ఐ పోచయ్య, గ్రామ సర్పంచ్ రాయిపల్లి సురేందర్, గ్రామ పెద్దలు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
E Nivas News