ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కోరారు.వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్ లో ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుల కోసం నిర్వహిస్తున్న పది రోజుల శిక్షణా శిబిరం ఐదవ రోజైన బుధవారం కార్యక్రమం జరిగింది. ఈ శిబిరం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పర్యవేక్షణలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని, సమాన అవకాశాలు కల్పించడం ద్వారా రాజకీయ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని వివరించారు. యువత, మహిళలు రాజకీయాల్లోకిరావాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ రంగం, రాజకీయాల అనుసంధానంపై పలు సూచనలు చేశారు. రైతుల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి పార్టీ స్థాయిలో చర్చలు జరిపి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి, సాగు విధానాల్లో మార్పులు, మార్కెటింగ్ సౌకర్యాల మెరుగుదల వంటి అంశాలపై దృష్టి సారించాలని చెప్పారు. శిబిరంలో పాల్గొన్న డిసిసి అధ్యక్షులు పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై స్పందన,సోషల్ మీడియా వినియోగం, బూత్ స్థాయి వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఈ శిబిరం ద్వారా జిల్లాస్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింతసమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా నాయకులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News