ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లాలో నవంబర్ 1వ తేదీ నుండి పత్తి కొనుగోలు చేపట్టనున్న పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శుక్రవారం జిల్లాలోని తాండూర్ మండలంలోని మహేశ్వరి కాటన్స్, శ్రీరామా జిన్నింగ్ ప్రెస్సింగ్ యూనిట్ లను మండల తహసిల్దార్ జ్యోత్స్న తో కలిసి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం సిసిఐ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. 2025- 26 సంవత్సరంలో మద్దతు ధర కింద సి.సి.ఐ కు పత్తి విక్రయించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్ లో రైతులు తమ వివరాలు నమోదు చేసుకుని పత్తి విక్రయానికి స్లాట్ బుక్ చేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. నిబంధనల ప్రకారం పత్తిలో తేమ శాతం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని రైతుల వద్ద నుండి పత్తి కొనుగోలు చేయాలని సూచించారు. ఆధార్ నంబర్ కు అనుసంధానం చేయబడిన బ్యాంకు ఖాతాలో మాత్రమే చెల్లింపులు జరుగుతాయని, ఆధార్ కార్డులో ఫోటో కలిగి ఉన్న రైతు మాత్రమే తక్పట్టిలో ఫోటో దిగవలసి ఉంటుందని తెలిపారు. దళారులు కొనుగోలు చేసిన పత్తిని కొనుగోలు కేంద్రాలలోనికి అనుమతించకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News