ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల మధ్య జరిగే ప్రతి చర్చకు రాజకీయాలను ఆపాదిస్తూ రహస్య భేటీ అంటూ విష ప్రచారం చేయడం తగదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంత్రుల భేటీపై సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని మంగళవారం విడుదల చేసిన ఓక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే కొందరు కావాలనే పని గట్టుకొని ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో క్యాబినెట్ అనేది ఒక యూనిట్ పాలనాపరమైన అంశాల్లో ఎక్కడా జాప్యం ఏర్పడకుండా ఉండటానికి సీనియర్ మంత్రులుగా మేం చర్చించుకుంటే అందులో తప్పేముందని, అది ప్రభుత్వ సమష్టి బాధ్యత అని, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాసంలో మేము భేటీ అయ్యి పాలనాపరమైన అంశాలను చర్చించామని స్పష్టం చేశారు. లోక్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం ముగిసిన తర్వాత అందరి ముందే మేమంతా ఒకే కారులో వెళ్లి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల సన్నద్ధత అనేది రాజకీయ పార్టీల ప్రాథమిక బాధ్యతని దీనికి కూడా లేనిపోని రంగులు పూయడం సమంజసం కాదన్నారు. నిర్మాణాత్మకమైన విమర్శలను మేము ఎప్పుడూ స్వాగతిస్తాం కానీ వ్యక్తిత్వ సహననానికి, ఊహాజనిత కథనాలకు పాల్పడితే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న మా ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం ఇకనైనా మానుకొని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు.
Admin
E Nivas News