ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బీఆర్ఎస్ఎమ్మెల్యేలపై బుధవారం శాసనసభలో సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఈ సమావేశాలకు మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూరంగా ఉండనున్నారు. శాసనసభ సజావుగా కొనసాగకుండా అడ్డుకుంటున్న బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్కు శ్రీధర్బాబు సిఫారసు చేయగా, స్పీకర్ అనుమతిస్తూ వేటు వేశారు. శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్రావు, జగదీశ్రెడ్డి, గంగుల కమలాకర్, అనిల్ జాదవ్, కౌశిక్రెడ్డి, మాధవరం కృష్ణారావు, కోవా లక్ష్మి, మాణిక్రావు, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, విజేయుడు, కె.సంజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కేపీ వివేకానందలపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటన చేశారు. మూడో రోజు సభ ప్రారంభమైన వెంటనే 'వి వాంట్ జస్టిస్' అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసన సభా కార్యకలాపాలకు అడ్డు తగిలారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించారు. దీంతో వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రతిపాదించారు. దీంతో స్పీకర్ సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం స్పీకర్ను కలిసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకున్నారు.సభ సజావుగా నడిచేలా సభాపతికి చేయాల్సిన అవమానాలన్నీ బీఆర్ఎస్ నేతలు చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. అవమానాలు కొనసాగించే పరిస్థితి మానుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. సభాపతి సూచన చేస్తే వాదన పెట్టుకోకుండా సభ సజావుగా నడిచేలా చూడాలన్నారు. వెల్లోకి వచ్చి చేయాల్సిన అవమానాలన్నీ చేసి స్పీకర్పై సవాల్ విసురుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం చేయొద్దని కోరారు. విభజన తీసుకురావడానికి మరో ప్రయత్నం మంచిది కాదని, సభాపతితో పాటు వారి తల్లిని దూషిస్తే నిరసనలు తెలపడం జరిగిందన్నారు. న్యాయం కావాల్సింది బలహీనవర్గాలకు అన్నారు. నిన్న నిరసనలో భాగంగా దళిత సంఘాలు ఎర్రవల్లిలోని రోడ్డుపై నడిస్తే అక్కడ పసుపు నీళ్లతో శుద్ధి చేశారని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు నీటితో రోడ్డు శుద్ధి చేసి అవమానించడమే కాకుండా న్యాయం కావాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కావాల్సింది బలహీనవర్గాలు, దళిత, గిరిజనులకని పేర్కొన్నారు. బీఆర్ఎస్ చేతుల్లో అవమానానికి గురవుతున్న పేద ప్రజలకు న్యాయం జరగాలని చెప్పారు. విపక్ష నేతల ఆగడాలు,అవమానాలను ప్రభుత్వం సంయమనంతో భరిస్తోందని చెప్పారు. రాష్ట్రాన్ని విపక్ష నేతలు ఏం చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. దొరతనం పోకడలనుభరించడానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా లేదని ఘాటుగా స్పందించారు.
Admin
E Nivas News