ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మహారాష్ట్ర సరిహద్దు నుండి అక్రమ రవాణా జరగకుండా పూర్తిగా అడ్డుకట్ట వేయగలరని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వార్షిక తనిఖీలలో భాగంగా మంగళవారం గాదిగూడ పోలీస్ స్టేషన్ ను పరిశీలించారు. మొదటగా సిబ్బందిచే ఏర్పాటు చేసిన గౌరవ వందనాన్ని స్వీకరించి, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక మొక్కను నాటారు. సిబ్బందిచే పరేడ్ నిర్వహించి పరేడ్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. పోలీసు ప్రతి ఒక్కరూ సక్రమమైన యూనిఫామ్ ధరించాలని, విధులలో నీతి నిజాయితీ, క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. గ్రామాలను సందర్శిస్తూ విపిఓ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దు గుండా రాయితీ బియ్యం, గుడుంబా, గంజాయి తరలకుండా చర్యలు చేపట్టాలని మండల పరిధిలో మాదకద్రవ్యాల నిర్మూలనకు వాటి వల్ల కలుగు అనార్థాలపై ప్రజలకు సవివరంగా తెలియజేసి చైతన్య పరచాలని తెలిపారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా ఉండాలని, సిబ్బంది విధుల పై పర్యవేక్షణ చేయాలని తెలిపారు. గ్రామాలను సందర్శిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా పర్యవేక్షించాలని, ప్రజలకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ ను పరిశీలించి బాధితుల సమస్యల పట్ల బాధ్యతయుతంగా వ్యవహరించి పరిష్కారానికి కృషి చేయాలి అన్నారు. స్టేషన్లో పెండింగ్ లో ఉన్న రికార్డులు త్వరితగతిన పూర్తి చేసి ఛార్జ్ షీటు దాఖలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ అదనపు ఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్, పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి ప్రణయ్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News