ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు 11 న జరగనున్న ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది అని ఆదివారం జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల తెలిపారు. ఎన్నికల సమయం మొదలు కొని ఫలితాలు వెల్లడించే వరకు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా అంతటా ముందస్తు చర్యలు చేపట్టామని, ఎన్నికల ప్రక్రియ మొత్తం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, ఎలక్షన్ సెల్ ద్వారా నిరంతరం పర్యవేక్షణలో ఉంటుందని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలు మరియు కీలక ప్రాంతాలు సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రచార సమయం 9 సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని తెలిపారు. ప్రచార సమయం ముగిశాక అభ్యర్థులు లేదా వారి మద్దతుదారులు ఎవరూ కూడా ప్రచారం నిర్వహించరాదని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం నిర్వహిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కేసులు నమోదైతే అభ్యర్థిత్వం కూడా కోల్పోయే అవకాశముందని హెచ్చరించారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు సైలెన్స్ డేగా పరిగణించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమయంలో స్థానికేతరులు, ఓటర్లు కానివారు కాలనీలు, వార్డుల్లో సంచరించరాదని, అక్కడ ఉండకూడదని స్పష్టం చేశారు. ఓటర్లను డబ్బు, మద్యం, బహుమతులు వంటి వాటితో ప్రలోభాలకు గురిచేయవద్దని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయాలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల కోరారు.
Admin
E Nivas News