ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ఆరెంద జడ్.పి.హెచ్.ఎస్ లో కాంప్లెక్స్ హెచ్ఎం నరసింహారావు ఆధ్వర్యంలో న్యూట్రిషన్ ఫుడ్ – పోషణ ఆహారోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 55 మంది విద్యార్థులు చురుకుగా పాల్గొని, వివిధ రకాల పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను తయారు చేసి ప్రదర్శించారు. ఆయా ఆహార పదార్థాల్లో ఉండే పోషక విలువలు, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను విద్యార్థులే స్వయంగా వివరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా కాంప్లెక్స్ హెచ్ఎం నరసింహారావు మాట్లాడుతూ విద్యార్థులు నిత్యం పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తెలిపారు. చిన్నప్పటి నుంచే పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని, దీని ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లు పెరుగుతాయన్నారు. స్థానికంగా లభించే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను ఆహారంలో భాగంగా చేసుకుంటే తక్కువ ఖర్చుతో పోషణ మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులకు కూడా పిల్లల పోషణపై అవగాహన కలిగించడమే లక్ష్యమని నరసింహారావు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తాము తయారు చేసిన ఆహార పదార్థాల వివరాలను పాఠశాల కమిటీ చైర్మన్ ప్రేమ లతకు, అలాగే తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీలత, సువార్త, పద్మజ, మమత, సి.ఆర్.పీ మల్లన్న తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News