ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఆదివారం మంచిర్యాల జిల్లా జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట, నమ్నూర్, దొనబండ, లక్షెట్టిపేట మండలం గుల్లకోట లలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు, తేమ యంత్రాలు, ప్యాడి క్లీనర్లు ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని, కొనుగోలు కేంద్రాల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు, గోదాములకు తరలించాలని, లక్షెట్టిపేట మండలం మిట్టపల్లి, లక్ష్మీపూర్ లలో గల రైస్ మిల్లులను మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి సందర్శించి ధాన్యం దిగుమతి ప్రక్రియ పరిశీలించారు. రైస్ మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకోవాలని తెలిపారు. ఒకరోజులో కనీసం 10 నుంచి 15 లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని, అవసరం మేరకు హమాలీల సంఖ్య పెంపొందించుకోవాలని సూచించారు. వరి ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియ అనుసంధానంగా జరగాలని, రవాణా శాఖ ఆధ్వర్యంలో ధాన్యం తరలింపుకు అవసరమైన లారీలను సమకూర్చడం జరుగుతుందని, రైస్ మిల్లుల యజమానులు ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో గల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. వేసవి అయినందున వడదెబ్బకు గురికాకుండా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రజలతో మాట్లాడి ఆసుపత్రిలో కల్పించిన సౌకర్యాలు, అందిస్తున్న వైద్యసేవల వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News