ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : చెన్నూర్ ను ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని, 2027 జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు.మంగళవారం జిల్లాలోని చెన్నూర్ లో పుష్కర ఘాట్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, నీటిపారుదల శాఖ అధికారి విష్ణు, మండల తహసిల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్, మున్సిపల్ చైర్ పర్సన్ పెద్దింటి పద్మ లతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు 2027 కొరకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనుల కొరకు 1 వేయి కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, ఇందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చెన్నూర్ లో పుష్కరాలు, మౌలిక వసతుల అభివృద్ధి కొరకు 70 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. సుమారు 8 కోట్ల రూపాయలతో పుష్కర ఘాట్లు, స్నానపు గదులు, రహదారులు తదితర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, పుష్కరాలకు దాదాపు 1 లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా రోడ్లు, త్రాగునీరు, పారిశుధ్యం, లైటింగ్, పార్కింగ్ తదితర మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గోదావరి రోడ్డుతో పాటు చెన్నూర్ పట్టణంలోని రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని, అంబేద్కర్ విగ్రహం నుంచి చెన్నూర్ వరకు సుమారు 5 కోట్ల 50 లక్షల రూపాయలతో రోడ్డు విస్తరణ, లైటింగ్ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రోడ్డు విస్తరణలో షాపులు కోల్పోయిన చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా షాపులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని, పేదలు, చిరు వ్యాపారులకు ప్రయోజనం కలిగేలా 1 కోటి 20 లక్షల రూపాయల డి ఎం ఎఫ్ టి నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. అమృత్ 2.0 పథకం క్రింద సుమారు 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రతి ఇంటికి నల్లా ద్వారా త్రాగునీరు అందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. చెన్నూర్ పెద్ద చెరువును సుమారు 17 కోట్ల రూపాయలతో చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, శివ్వారం గోదావరి మొసళ్ల మడుగు ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని, కాళేశ్వరం, ధర్మపురి, బాసర, భద్రాచలం, కోటిలింగాల, చెన్నూర్ లోని అంబ అగస్తేశ్వర ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పుష్కరాల నాటికి ఆలయాలు, పుష్కర ఘాట్లు, రోడ్లు తదితర అభివృద్ధి పనులు పూర్తి చేసి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. చెన్నూర్ లో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ఈ నెలలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అనంతరం పుష్కర ఘాట్లోని హనుమాన్ ఆలయంలోభూమిపూజ నిర్వహించారు. చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు బొక్కలగూడెంలో గౌడ సంఘం కమ్యూనిటీ భవనానికి భూమిపూజ చేశారు. సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో కమ్యూనిటీ భవనం నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. పేద గౌడ కులస్తులలో ఇందిరమ్మ ఇళ్లు లేని అర్హులైనకుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ఇళ్ల సౌకర్యంకల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెన్నూర్ లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సన్న బియ్యం పంపిణీ తదితర అంశాలపై మంత్రి సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లాలోని మందమర్రి మండలం రామకృష్ణాపూర్ ప్రాంతంలోని 5వ వార్డులో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు షేర్ ద విజన్ - ఖమ్మం సంస్థ ప్రతినిధి పి.నారాయణ అందజేసిన వాటర్ బాటిల్, నోట్ పుస్తకాలు, క్రీడా సామాగ్రి లతో కూడిన కిట్లను జిల్లా కలెక్టర్, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, షేర్ ద విజన్ సంస్థ సభ్యుల తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కిట్లు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో రూఫింగ్ పనుల కొరకు 30 లక్షల రూపాయల డి ఎం ఎఫ్ టి నిధులు మంజూరు చేయడం జరిగిందని, విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రమైన త్రాగునీటి కొరకు ఆర్.ఓ. ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు, కాస్మెటిక్ ఛార్జీలు, క్రీడా సామగ్రి తదితర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. మెస్ చార్జీలను 40 శాతం పెంచడం జరిగిందని, ఉపాధ్యాయుల నియామకం చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. చెన్నూర్ మండలం సోమనపల్లిలో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసానికి ఎంతో ఉపయోగపడుతుందని, విద్యార్థులు అందుబాటులోకి వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. చెన్నూర్ లో డిగ్రీ కళాశాల అభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న బ్రేక్ఫాస్ట్ పథకం ద్వారా విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో ఈ సంవత్సరం విద్యార్థుల నమోదు పెరిగిందని తెలిపారు. సోమనపల్లిలో సుమారు 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 100 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ఆర్.ఓ. ప్లాంట్ల ఏర్పాటు, నాణ్యమైన ఆహారం, యూనిఫాంలు తదితర సౌకర్యాలుకల్పించడం జరుగుతుందని, సొంత భవనాలు లేని పాఠశాలలకు సొంత భవనాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం, ఏకరూప దుస్తులు, పుస్తకాలు అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో లెర్నింగ్ అవుట్కమ్స్ మెరుగ్గా ఉన్నాయని, ఇదే స్థాయిని కొనసాగించేలా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News