ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా చెన్నురు నియోజకవర్గం మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి రిజిస్టర్లు, మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి వివరాలు, పారిశుధ్య నిర్వహణ అంశాలను మున్సిపల్ కమిషనర్ రాజు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. అంతర్గత రహదారులు, మురుగు కాలువల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, పారిశుధ్య నిర్వహణలో భాగంగా వార్డులలోని ప్రతి ఇంటి నుండి ప్రతి రోజు తడి చెత్త, పొడి చెత్తలను వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలని తెలిపారు. ప్రతి ఇంటికి ఎలాంటి అంతరాయం లేకుండా త్రాగునీరు సరఫరా చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నర్సరీలలో నాటేందుకు అవసరమైన మొక్కలను అభివృద్ధి చేయాలని, మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలో పెండింగ్ ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలో రెండు పడకగదుల ఇండ్ల పథకంలో భాగంగా నిర్మించిన భవనాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.అమృత్ 2.0 పథకంలో భాగంగా మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న నీటి బ్యాంకుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం మందమర్రి మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి మున్సిపల్ కమిషనర్ రాజలింగుతో కలిసి అభివృద్ధి పనుల పురోగతి, పారిశుధ్యం, నర్సరీల నిర్వహణ, తాగునీటి సరఫరా, రెండు పడక గదుల ఇండ్ల పథకం నిర్వహణపై సమీక్షించారు. మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసే విధంగా సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News