ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్లో రామగుండంమున్సిపల్ కార్పొరేషన్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు మరియు మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, చెన్నూర్, క్యాతన్పల్లి, బెల్లంపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీలలో మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 11న జరగనున్న నేపథ్యంలో,పై పేర్కొన్న మున్సిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 9 సాయంత్రం 5:00 గంటల నుండి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు మరియు 13ఉదయం 8 గంటల నుండికౌంటింగ్, ఫలితాల వెల్లడింపు పూర్తయ్యే వరకు సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్. యాక్ట్ అమల్లో ఉంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆంక్షల కాలంలో నలుగురికి మించి గుంపులుగా చేరడం పూర్తిగా నిషేధమని తెలిపారు. ఎన్నికల వాతావరణాన్ని ఉద్రిక్తం చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కవ్వింపు చర్యలు, గొడవలకు దారితీసే ప్రవర్తన ఏదైనా చోటుచేసుకున్నట్లయితే వెంటనే చట్టపరమైన చర్యలుతీసుకుంటామని హెచ్చరించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, అటవీ అధికారులు,కేంద్ర బలగాలు, హోమ్గార్డులు మరియు ఎస్పీఓలకు ఈ నిషేధాలు వర్తించవని స్పష్టం చేశారు. చట్టపరమైన అనుమతి లేకుండా ఊరేగింపులు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని, పోలింగ్ కేంద్రాల ఒక కిలోమీటర్ పరిధిలో కర్రలు,కత్తులు, తుపాకులు లేదా ఎలాంటి మారణాయుధాలతో సంచరించడం పూర్తిగా నిషేధమని సీపీ తెలిపారు. తాత్కాలిక నిర్మాణాలైన షామియానాలు, పందిళ్లు ఏర్పాటు చేయడానికి కూడా తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు.మైకులు, లౌడ్స్పీకర్ల ద్వారా పాటలు ప్రసారం చేయడం, సభలు నిర్వహించడం, ప్రజలను ఒక వర్గం మీద మరొక వర్గం మీద రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడం నిషేధమని తెలిపారు.ఎన్నికల సమయంలో చట్టబద్ధమైన అధికారాన్ని ధిక్కరించే విధమైన ప్రకటనలు, ప్లకార్డులు,గుర్తులు ప్రదర్శించడం కూడా చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.
Admin
E Nivas News