ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీ జెఎసి) నేతృత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో జరిగిన చర్చల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలపై పలు కీలక నిర్ణయాలు సాధించిన సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులను ఘనంగా సన్మానించారు. నేడు ఆత్మకూరు పట్టణంలోని, పెన్షనర్ల సంక్షేమ సంఘం భవనంలో ఏపీజెఎసి తాలూకా అధ్యక్షుడు ఎస్.సాజిద్ బాషా, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు జి.కొండయ్య, పూర్వ అధ్యక్షుడు బి.అచ్చయ్య, ట్రెజరర్ వై.నాగప్ప, రిటైర్డ్ పశువైద్య సూపరింటెండెంట్ ఓ.మూర్తుజా లకు శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీజెఎసి తాలూకా అధ్యక్షుడు ఎస్.సాజిద్ బాషా మాట్లాడుతూ, ఏపీ ఎన్జీవోస్ మరియు జేఏసీ అనుబంధ సంఘాల నాయకులు సంయుక్తంగా కృషి చేసి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో చర్చించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ప్రయోజనం కలిగిందన్నారు. ప్రధానంగా పిఆర్సి కమిషన్ ఏర్పాటు, రెండు డిఎల విడుదల, అదనపు క్వాంటం పెన్షన్ పెంపు, ఒక విడత సరెండర్ లీవ్ చెల్లింపు, ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపు వంటి కీలక నిర్ణయాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అదనపు క్వాంటం పెన్షన్ పెంపును పునరుద్ధరించడం పెన్షనర్లకు ఎంతో ప్రయోజనకరమని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం అందరినీ కలుపుకుని 30% మధ్యంతర భృతి (ఐ ఆర్), మెరుగైన పిఆర్సి, ఆర్థిక బకాయిల విడుదల తదితర అంశాలపై నిరంతరం కృషి చేస్తామని ఏపీజెఎసి తాలూకా అధ్యక్షుడు ఎస్.సాజిద్ బాష తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్ల సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News