ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : పేద విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో "విద్యార్థి ప్రోత్సాహక అభినందన సభ" గురువారం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ముందు పాఠశాల ఆవరణలోని సరస్వతి, ఫాతిమాబీ, మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాలలో, విద్యాబుద్ధులు నేర్పిన కీర్తిశేషులైన గురువులు మరియు విద్యార్థుల స్మృతికి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ప్రతిభను గుర్తించి ప్రభుత్వ, ప్రైవేట్ టాపర్స్ సత్కారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల 10వ తరగతి టాపర్స్కు శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి, మెమొంటోలు చేతికి అందించి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతిభ చాటిన పేద విద్యార్థులకు మొత్తం రూ.1లక్ష, 35 వేల నగదు ప్రోత్సాహకం స్కాలర్షిప్లు అందజేశారు. ఇందులో 15 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6000, 6 మందికి రూ.5000 చొప్పున, మూడు వేల రూపాయల చొప్పున ఒకరికి, 6 మందికి రూ.1500 చొప్పున, ఒకరికి రూ.1000/- చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నం సుధాకర్ రెడ్డి దంపతులకు, సిఎ పూర్తి చేసిన తాళ్లూరి శ్యామ్కు పూర్వ విద్యార్థుల సంఘం ఘనంగా సన్మానం చేసింది. పేద విద్యార్థులకు చేయూతనిచ్చిన పూర్వ విద్యార్థుల సంఘం సేవలను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, పూర్వ విద్యార్థుల సంఘం అందిస్తున్న ప్రోత్సాహం ఇతరులకు ఆదర్శమని కొనియాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా పూర్వ విద్యార్థుల సేవలు మన వెలుగోడు పట్టణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఉండడం మనందరి అదృష్టం అని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మాలిక్ ఖాన్, ఇన్చార్జి హెచ్ఎం మొయినుద్దీన్, మాజీ సర్పంచ్ వేల్పుల జయపాల్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు జి.రామలింగారెడ్డి, మక్బుల్ బాషా, వై.సుధాకర్ రెడ్డి, జయరామిరెడ్డి, నసురుల్లా ఖాన్, శ్రీకాంత్ రెడ్డి, సుల్తాన్ మొహిద్దిన్, జె.రఫిక్ అహ్మద్, నారాయణ, శ్రీరాములు, ప్రభుత్వ -ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, హెచ్ఎంలు డాక్టర్ ఎంఎఫ్. ఇమ్మానియేల్, అతావుల్లా, నరసింహులు, తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News