ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని, పెద్ద కబేలా వీధిలో గల చైతన్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆధ్వర్యంలో ఎస్ఏఎస్ఏ కార్యక్రమం మరియు జాతీయ జెండా దినోత్సవం సందర్భంగా "స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ ఆత్మకూరు" అనే నినాదంతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పరిశుభ్రమైన పరిసరాలు, పర్యావరణ పరిరక్షణ, జాతీయ జెండాపై గౌరవ భావం, పౌర బాధ్యతలపై ప్రజల్లో చైతన్యం కల్పించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ, ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ సిబ్బంది జీవన్ కుమార్ ఓబులేసు, రఫీక్, రాఘవ మరియు పాఠశాల కరెస్పాండెంట్ తాజుద్దీన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీని అతిథులు జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని, ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిర్మూలన, జాతీయ జెండా గౌరవాన్ని తెలియజేస్తూ నినాదాలు చేశారు. రహదారులపై చెత్త వేయకుండా పరిశుభ్రతను పాటించాలని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం నంద్యాల టర్నింగ్ వద్ద విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేసి "స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ ఆత్మకూరు" సందేశాన్ని ప్రజలకు బలంగా చాటిచెప్పారు. విద్యార్థుల క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక బాధ్యతను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ మానవహారం స్థానిక ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ మాట్లాడుతూ పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందనీ అన్నారు. ప్రతి విద్యార్థి పరిశుభ్రతకు రాయబారిగా మారి సమాజానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనలో యువత, విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో కీలకం అని అన్నారు. ప్రతి ఇంటి నుంచి పరిశుభ్రత ఉద్యమం ప్రారంభమైతేనే మన ఆత్మకూరు ఆదర్శ పట్టణంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ మరియు హెడ్ మాస్టర్ తాజుద్దీన్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక బాధ్యత, దేశభక్తి, పరిశుభ్రత విలువలను పెంపొందించడం మా పాఠశాల లక్ష్యం అని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంచుతాయని తెలిపారు. ర్యాలీ ముగింపులో అతిథులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి 'స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ ఆత్మకూరు లక్ష్యాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ అవగాహన ర్యాలీ పట్టణ ప్రజల్లో విశేష స్పందనను పొందడమే కాకుండా పరిశుభ్రత, దేశభక్తి, సామాజిక బాధ్యతలపై చైతన్యాన్ని పెంపొందించింది.
Admin
E Nivas News