ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : నంద్యాల జిల్లా, ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని, కొత్తపల్లి పోలీస్ స్టేషన్ను జిల్లా పోలీసు అధికారి సునీల్ షొరాణ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ పోలీస్ స్టేషన్ పరిసరాలు, లాకప్ గదులు, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది హాజరు వివరాలు, స్టేషన్ రికార్డులు, కేసు నమోదు తదితర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్ష నిర్వహించి, వాటిని త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్టేషన్ పరిధిలోని, గ్రామాల పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితి, గ్రామాల్లో పోలీసింగ్ విధానం తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందేలా ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. తదుపరి జానాలగూడెం చెంచు గ్రామాన్ని స్వయంగా సందర్శించిన జిల్లా ఎస్పీ గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో ఐకమత్య వాతావరణాన్ని కొనసాగిస్తూ ఎలాంటి గొడవలు, వివాదాలకు తావు ఇవ్వకుండా పరస్పర సహకారంతో జీవించాలని సూచించారు. అలాగే పిల్లలకు విద్యను అందించి వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా ప్రతి కుటుంబం కృషి చేయాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే జిల్లా పోలీసు శాఖ యొక్క అత్యున్నత ప్రాధాన్యత. ప్రజలకు పోలీసు సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఆత్మకూరు డిఎస్పి-ఆర్.రామంజి నాయక్ సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News