ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య జిల్లా/ రైల్వే కోడూరు : అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 10న మహారాష్ట్ర రాష్ట్రంలోని, ఔరంగాబాద్ నగరంలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక “భారత గౌరవ్ అవార్డ్– 2025” కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సయ్యద్ మెహతాజ్ బేగం భారత్ గౌరవ్ అవార్డు అందుకుని ప్రత్యేక గుర్తింపు పొందారు. అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు ప్రాంతానికి చెందిన మెహతాజ్ బేగం గత కొంతకాలంగా సామాజిక న్యాయం, మహిళా సాధికారత, మానవ హక్కుల రక్షణ, బాధితుల పట్ల న్యాయం మరియు అవగాహన కార్యక్రమాల్లో విశేష సేవలను అందిస్తూ ముందంజలో నిలుస్తున్నారు. ఆమె చేసిన సమాజ సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు అనేక కుటుంబాలకు ఆశాకిరణం అయ్యాయి. ఆమె సమాజ సేవలను పరిగణనలోకి తీసుకుని, వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎం.ఆర్.అన్సారీ స్వయంగా ఆమెకు అవార్డు అందజేశారు. దేశం నలుమూలల నుండి ప్రతిభావంతులు, సేవాభావం కలిగిన వ్యక్తులు పాల్గొన్న ఈ అవార్డు కార్యక్రమంలో మెహతాజ్ బేగం పేరు వినిపించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గౌరవం లభించింది. అవార్డు స్వీకరించిన అనంతరం, తనను ఈ పురస్కారానికి నామినేట్ చేసిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు షేక్.మస్తాన్ సాహెబ్ కి సయ్యద్.మెహతాజ్ బేగం కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక సేవ పట్ల తన కట్టుబాటును మరింత బలోపేతం చేస్తూ, భవిష్యత్తులో మహిళల భద్రత, విద్య, హక్కుల పరిరక్షణ, అణగారిన వర్గాల అభ్యున్నతికి మరింత శ్రమించి, కృషి చేస్తానని ఆమె తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగానికి వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్రాధ్యక్షురాలిగా సేవలు అందిస్తున్న మెహతాజ్ బేగం కు భారత్ గౌరవ్ అవార్డు-2025 రావడం, ఆమె కృషి, ఈ సాధన, రైల్వే కోడూరు – అన్నమయ్య జిల్లాకు, ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణమై నిలిచిందనీ సేవా భారతి యూత్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు- ఎస్.షర్ఫద్దీన్ అలి, స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాలు ఆమె విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.
Admin
E Nivas News