ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 లోని షెడ్యూల్ 6 మరియు కిందకు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక ఉత్తర్వులు (జి.ఓ. ఎంఎస్.నెం-45) జారీ చేయడం పట్ల ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని డైరెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ & టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జి.నాగముని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ & టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జి.నాగముని మాట్లాడుతూ గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు డిమాండ్ లు సానుకూలంగా పరిశీలించి, కార్మికలోకానికి అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాననీ అన్నారు. ముఖ్యంగా 01-01-2022 నుండి పాత తేదీతో ఉత్తర్వులను వర్తింపజేయడం ద్వారా ఎంతోమంది సీనియర్ ఉద్యోగులకు, అధికారులకు ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ అనుభవం, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక దృక్పథం, మరియు యువ నాయకుడు నారా లోకేష్ చొరవతో ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ ఉత్తర్వుల వల్ల కోర్టు కేసుల ద్వారా సేవలో కొనసాగిన వారికి, విధుల్లో తిరిగి చేరే వారికి పూర్తి లబ్ది చేకూరుతుందన్నారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ఉన్న సత్సంబంధాలకు ఈ జీవో ఒక నిదర్శనం అని అన్నారు. విద్యాశాఖ మరియు దాని అనుబంధ సొసైటీలలోని, ఉద్యోగులందరి తరపున ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని తెలిపారు.
Admin
E Nivas News