ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : సమాజంలో కుల వివక్షత లేని సమ సమాజం కోసం పోరాడాలని కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి.స్వామన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎస్.బాలయ్య పిలుపునిచ్చారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించి, అనంతరం వినతి పత్రాన్ని డిప్యూటీ తహాసిల్దార్-పఠాన్ బాబు, రెవిన్యూ ఇన్స్పెక్టర్-డి.ఖాజాబీ లకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రానంతరం కొంతవరకు వచ్చిన మార్పుల వల్ల కుల వివక్షత ఇంకా పోలేదని అది అనేక రూపాలలో నేటికీ కొనసాగుతుందనీ, అనేక ప్రాంతాలలో పెత్తందారి వ్యవస్థ బుసలు కొడుతున్నదన్నారు. నేటికీ దళితులు సమాజంలో కుల వ్యవస్థ ను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల స్మశాన వాటిక సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన జీవో 1235 అమలు చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసుల్లో పోలీసుల నిర్లక్ష్యం వహిస్తూ పెత్తందారులు కొమ్ముకాస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే జస్టిస్ పుల్లయ్య కమిషన్ సిఫారసులను అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దళిత సమస్య ఒక కులానికి మాత్రమే కాదని అది సామాజిక రుగ్మత అని వారు పేర్కొన్నారు. దళితుల స్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కులం పునాదుల మీద ఒక జాతిని గాని, ఒక నీతిని గాని, దేశాన్ని గాని నిర్మించలేరని ఎవరైనా ఆ విధంగా పూనుకుంటే అది విఫలం కాక తప్పదని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. దళిత కాలనీలో మంచినీరు, రోడ్లు, వీధిలైట్లు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, ఏర్పాటు చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు నల్లమల అబ్రహం, పురుషోత్తం, రంగస్వామి, ఏసేపు, ఆనంద్, బాలయేసు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News