ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు మండలంలోని, కొట్టాలచెరువు గ్రామంలో తొమ్మిదేళ్ల చిన్నారిపై జరిగిన అమానుష ఘటనపై డీఎస్పీ-ఆర్.రామాంజీ నాయక్ ఆద్వర్యంలో ఆత్మకూరు పోలీసులు అత్యంత వేగంగా, సమర్థవంతంగా స్పందించారు. ఈ సందర్భంగా డిఎస్పి ఆర్.రామాంజి నాయక్ మాట్లాడుతూ కేవలం అంగట్లో దొంగతనం చేసిందనే తీవ్ర అనుమానంతో చిన్నారిని అక్రమంగా నిర్బంధించి, తాడుతో కట్టేసి హింసించిన నిందితుల ఆటకట్టించారు. ఘటన జరిగిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే చిన్నారి తల్లి కడమంచి గంగమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఆత్మకూరు అర్బన్ సీఐ, ఎస్ఐ లు మరియు సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగారు. కేసు తీవ్రతను గుర్తించిన పోలీసులు, నిందితులు పరారవ్వక ముందే గంటల వ్యవధిలోనే పక్కా సమాచారంతో మెరుపు దాడి చేశారు. కురుకుంద రోడ్డులోని, ఇటుకల బట్టీ దగ్గర దాక్కున్న ప్రధాన నిందితులు రాజు నాయక్ (ఎ1), మల్లు నాయక్ (ఏ2)లను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు తొమ్మిదేళ్ల మైనర్ బాలిక కావడం, పైగా బాలిక గుర్తింపు బయటపడేలా వీడియో చిత్రీకరించడాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు నిందితులపై బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు జువైనల్ జస్టిస్ (జెజె) యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, వారిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఘటన జరిగిన వెంటనే నిందితులను అరెస్ట్ చేసి, చిన్నారి కుటుంబానికి అండగా నిలిచిన ఆత్మకూరు పోలీసుల తక్షణ చర్యలపై స్థానికులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, బాధితురాలు మైనర్ కావడంతో ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు అర్బన్ సీఐ- మహేశ్వర్ రెడ్డి, రూలర్ సిఐ ఎం.సురేష్ కుమార్ రెడ్డి, ఎస్సైలు డీవి.నారాయణరెడ్డి, రఘు రామయ్య గౌడు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, తదితరులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News