ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : ద్విచక్ర వాహన చోదకుల ప్రాణాలకు హెల్మెట్ రక్షణ కవచం లాంటిదని హెల్మెట్ ధరించి వాహనం నడిపి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ వాహన చోదకులకు సూచించారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా మరియు పోలీసు శాఖల అధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మహిళల బైక్ ర్యాలీ ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ కలెక్టరెట్ వద్ద నుండి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ ప్రజలలో హెల్మెట్ ధరించి వాహనాలను నడపడం పై పూర్తి అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీ ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలలో చైతన్యం పెరిగి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఎంతగానో రాణిస్తున్నారన్నారు. దైనందిక జీవితంలో మహిళలు అవసరాలకు అనుగుణంగా ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తున్నారన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే మహిళల సంఖ్య నానాటికి పెరుగుతున్న తరుణంలో హెల్మెట్ ధరించడంపై మహిళలకు అవగాహన కల్పించి చైతన్య వంతులను చేయడం ఎంతో అవసరమన్నారు. జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం వాహనాలు నిర్లక్ష్యంగా నడవడం, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించడం వలన జరుగుతున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయన్నారు. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా బైక్ నడపడం సురక్షితం కాదన్నారు. రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ ధరించకపోవడం వలనేనని ఎక్కువ శాతం మరణాల బారిన పడుతున్నారన్నారు. హెల్మెట్ ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు రక్షణ కవచం లాంటిదనే విషయాన్ని ప్రతి ఒక్కరిలో గుర్తించేలా అవగాహన కల్పించే మరణాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కోరారు. డీసీపీ- ఎస్.కె.హసీనా బేగం మాట్లాడుతూ కార్లు ద్విచక్ర వాహనాలు నడిపే వాహన చోదకులు సీటు బెల్టు హెల్మెట్ తప్పక ధరించి వాహనాలను నడపాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా పోలీసు రవాణాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలతో బైక్ ర్యాలీని నిర్వహించి హెల్మెట్ వాడకంపై పూర్తి అవగాహన కల్పిస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ధరించని కారణంగా నిండు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ద్విచక్ర వాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలన్నారు. ద్విచక్ర వాహనదారులపై ప్రత్యేక నిఘా ఉంచి హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు. ఈ మహిళా బైక్ హెల్మెట్ ర్యాలీలో ఎసిపి- వంశీధర్ గౌడ్, ఆర్టీఓలు- ఆర్.ప్రవీణ్, కె.వెంకటేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు- ఎండి. అలీ, కె.శివరాం గౌడ్, ఎ.ఉదయ్ శివప్రసాద్, సిహెచ్- గీతాంజలి, కెబిఎన్ కళాశాల ఏవో- నారాయణ రావు, పలువురు మహిళాలు పాల్గొన్నారు.
Admin
E Nivas News