ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు (ఈవీఎం), వీవీప్యాట్ల గోదాముకు పకడ్బందీ భద్రతా కల్పించడం జరిగిన్నప్పటికీ నిరంతర పర్యవేక్షణలో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి బుధవారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని మార్కెట్ యార్డులో గల ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక విద్యుత్ పరికరాలను పరిశీలించి అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈబీఎం, బీవీప్యాట్లను భద్రపరుస్తున్న గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందించడం జరుగుతోందన్నారు. అదేవిధంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనూ మూడు నెలలకు ఒక సారి (త్రైమాసిక) తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులకు సూచించారు. ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు (ఈవీఎం), వీవీప్యాట్ల గోదాము తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట డీఆర్వో- ఎం.లక్ష్మీనరసింహం, వై.రామయ్య (తెలుగుదేశం), కందుల పరమేశ్వరరావు (ఆప్), కె.వెంకట రత్నం (బీఎస్పీ), జే.శ్రీనివాస్ (జనసేన), బొంతు కృష్ణారెడ్డి (బీజేపీ), అర్ రమణయ్య (వై.ఎస్.ఆర్.సి.పి), ఏఎస్ ప్రసాద్, ఎన్ ధనుంజయరావు (కాంగ్రెస్), తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News