ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : మామిడి తోటల రైతులు జాగ్రత్తలు పాటించాలని ఆత్మకూరు మండల హార్టికల్చర్ అధికారి కె.చందన శనివారం తెలిపారు. ఈ సందర్భంగా హార్టికల్చర్ అధికారిణి కె.చందన మాట్లాడుతూ.. మామిడి పూత ఈ సంవత్సరం ఆలస్యంగా రావడం కనిపిస్తోందన్నారు. ఇది ప్రధానంగా వాతావరణ మార్పులు, తీవ్రమైన చలి రాత్రులు, రాత్రి-పగలు ఉష్ణోగ్రతల మధ్య తీవ్రమైన తేడాలు, అకాల వర్షాలు వల్ల జరుగుతోందన్నారు. దీంతో పూత ఆలస్యమవుతుంది, కొన్ని చోట్ల పూత నల్లబడి రాలిపోతోందన్నారు. దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మామిడి రైతులు తీసుకోవాల్సిన ముఖ్యమైన సలహాలు- తక్షణ చర్యలు (పూత ఆలస్యమైన తోటల్లో పూలమొగ్గలను ఉత్తేజపరచడానికి) సూక్ష్మ పోషకాల పిచికారీ: జింక్ (జడ్ఎన్) + బోరాన్ (బోరాన్) మిశ్రమాన్ని చెట్లపై పిచికారీ చేయాలి. బోరాక్స్ పొడిని 1 లీటరు నీటికి 2 గ్రాములు కలిపి పూత మొగ్గలు బయటకు రాకముందే స్ప్రే చేయండి. ఇది పూత రావడానికి, పిందెలు రాలకుండా ఉండటానికి సహాయపడుతుందన్నారు. 13-0-45 5జి/లీటర్ + ఫార్ములా 4, 5జి/లీటర్ చొప్పున పిచికారీ చేయడం ద్వారా మిగిలిన పూత బయటికి రావడానికి సహాయపడుతుందన్నారు. పూత ఎక్కువగా రాలుతుంటే ప్లానోఫిక్స్ జాగ్రత్తగా, సరిగ్గా 5 ఎంఎల్/ 20 లీటర్ నీటికి చొప్పున పిచికారి చెయ్యాలన్నారు. పూత, పిందె దశలో పొగమంచు, అధిక తేమ వల్ల ఆకుపచ్చ తెగులు (అంత్రాక్నోస్), పూతమాడు (పోడేరీ మిల్డ్యూ), నల్లమచ్చ వంటివి ఎక్కువగా వస్తాయి. నీటిలో కరిగే గంధకం (సల్ఫర్) 3 గ్రాములు 1 లీటరు నీటికి కలిపి పూతకు ముందు, పూత తర్వాత, పిందె దశలో పిచికారీ చేయాలని తెలిపారు. తేనె మంచు పురుగులు, తామర పురుగులు ఎక్కువగా ఉన్నట్లయితే బుఫ్రొఫెజిన్ 1. 65ఎంఎల్/ లీటర్ లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.5ఎంఎల్ / లీటర్ లేదా థయోమిథాక్సామ్ 40జి/ ఎకరా వంటివి పిచికారీ చేయాలన్నారు. నీటి యాజమాన్యం & ఎరువులు పూత వచ్చిన తర్వాత డ్రిప్ ద్వారా లేదా తేలికగా నీరు ఇవ్వాలని, నీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు. యూరియా 1/2 కెజీ+ పొటాష్ 1/4 కేజీ ఒక చెట్టుకు చొప్పున వేసుకుంటే కాయ ఎదుగుదల బాగుంటుందన్నారు. ముఖ్య జాగ్రత్తలు: పూత, పిందె దశలలో ఉన్నప్పుడు దున్నడం చేయకూడదు, కలుపు మందులు కొట్టరాదన్నారు. ఇప్పుడు పూత ఆలస్యమైనా, సరైన జాగ్రత్తలతో మంచి పిందె, కాయలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వచ్చిన పూత, పిందెలను జాగ్రత్తగా కాపాడుకోవడం ద్వారా మంచి మార్కెట్ ధరలను పొందవచ్చు అన్నారు. పిందె దశలలో మామిడి పండ్లకు కవర్లు తొడగడం ద్వారా మంచి నాణ్యత, ధర లభిస్తాయి మరియు చీడ పీడల నుండి రక్షణ లభిస్తుందన్నారు. పండ్లు కోతకు వచ్చే సమయంలో పండు ఈగ చాలా నష్టం చేస్తుంది. నివారణకు లింగాకర్షక బుట్టలను ఎకరాకు 8-10 వాడాలన్నారు. పండ్ల కవర్లకు ఉద్యాన శాఖ ద్వారా హెక్టారుకు రూ.25,000/- సబ్సిడీ పొందవచ్చని. కాయలను మార్కెట్ చేస్కుకోవడానికి ప్లాస్టిక్ క్రేట్లు (టమాటో బాక్సులు) సబ్సిడీ లో రూ.120/- కి లభిస్తాయని తెలిపారు.
Admin
E Nivas News