ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : జిల్లావ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులకు సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ గురువారం క్యాంపు కార్యాలయం నుంచి దేవాదాయ శాఖ అధికారులతో పాటు వివిధ ఆలయాల ఈవోలు, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రతలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంతో పాటు జిల్లా వ్యాప్తంగా శివాలయాలకు పెద్దఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో ప్రణాళికాయుత చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణానదీ తీరంలోని దుర్గాఘాట్, పున్నమి ఘాట్, భవానీ ఘాట్, పవిత్ర సంగమం వంటి ప్రాంతాల్లో భక్తులు భారీ సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉన్నందున ఈ నెల 14, 15 తేదీల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఘాట్ల వద్ద, క్యూ లైన్లలో నిరంతరం పహారా కాయాలని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నిఘా ఉంచాలని పోలీసు శాఖకు సూచించారు. బ్యారికేడింగ్, ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ఘాట్ల వద్ద నిరంతర పారిశుధ్య పనులు చేపట్టాలని, భక్తులకు తాగునీరు, మొబైల్ టాయిలెట్ల సౌకర్యం కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. విజయవాడ, నందిగామ, తిరువూరు ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించాలని, వివిధ ఆలయాల్లో ముఖ్యంగా రద్దీ సమయాల్లో తొక్కిసలాట వంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధాన ఘాట్ల వద్ద మెడికల్ క్యాంపులు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. పండగ రోజుల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని, ఘాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. భక్తుల రక్షణను దృష్టిలో ఉంచుకొని 15 మంది శిక్షణ పొందిన గజ ఈతగాళ్లను మూడు షిఫ్టులలో ఘాట్ల వద్ద అందుబాటులో ఉంచాలని మత్స్య శాఖాధికారిని ఆదేశించారు. ఎక్కడైనా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసినట్లయితే తప్పనిసరిగా వాటికి డెయిలీ ఫిట్నెస్ చెకింగ్ రిజిస్టర్లను నిర్వహించాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు జరక్కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. సీసీటీవీ, డ్రోన్లను కూడా ఉపయోగించాలని సూచించారు. కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేయాలన్నారు. మహిళా భక్తులు, చిన్నపిల్లలు, వయోవృద్ధుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. అన్న ప్రసాదంతో పాటు లడ్డూ ప్రసాదాలను అత్యంత నాణ్యతతో అందించాలని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్ ఎన్.షణ్ముగం, ఆర్డీవోలు కె.బాలకృష్ణ, కె.మాధురి, సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమాచారం డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్, ఎన్టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయడం జరిగింది.
Admin
E Nivas News