ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆత్మకూరులో యూనియన్ నాయకులు, పాత్రికేయులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాత్రికేయులు తరలివచ్చి ఐకమత్యాన్ని చాటారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ రాయుడు ఆధ్వర్యంలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాధితులు, బాలింతలు, గర్భిణులకు యూనియన్ నాయకులు ఫలహారాలను పంపిణీ చేశారు. అనంతరం పాత్రికేయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓ వెంకట శివకు యూనియన్ సభ్యులు వినతిపత్రం సమర్పించారు. పాత్రికేయుల సమస్యలపై ఆర్డీఓ సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు కృష్ణ, కార్యదర్శి ఎస్.కే. సైఫుద్దీన్ లు మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం ఐక్యంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.జిల్లా కమిటీ నాయకులు శ్యామ్, శివగౌడ్, చంద్రయ్య, రవికుమార్ , సీనియర్ జర్నలిస్ట్ శీలం శేషు లు మాట్లాడుతూ జర్నలిస్టుల సమిష్టి కృషితోనే పోరాటాలు విజయవంతమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లయ్య, డేవిడ్, స్వాతి కిరణం ఎం.రాము గౌడ్ బి ఆర్ కే చంద్రశేఖర్ శ్రీనివాసులు, బాలరాజు, సల్మాన్, ఐ న్యూస్ శ్రీను, సుధాకర్, ఓబులేసు, వాహిద్, చంద్ర, అన్వర్, బీసేశ్వరరావు, జీ న్యూస్ శివ, బలరాముడు, హరీష్, శ్యామ్, రాజు, రమణ, ఖాదర్, పరశురాం సింగ్, తదితర మీడియా విలేకరులు పాల్గొన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ (డబ్ల్యూ జె హెచ్ ఎస్) అమలులో నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం నుంచి బకాయిలు ఉన్నాయన్న కారణంతో అనేక సందర్భాల్లో నెట్వర్క్ ఆస్పత్రుల్లో డబ్ల్యూ జె హెచ్ ఎస్ కార్డులను అనుమతించకపోవడం, కొన్ని వైద్య ప్రక్రియలకు కార్డు వర్తించకపోవడం వంటి లోటుపాట్లను సరిచేయాలన్నారు. పథకం అమల్లో ఎదురవుతున్న రోజువారీ సమస్యల పరిష్కారానికి సమాచార శాఖ, ఎన్టీఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో త్రైపాక్షిక పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని కూటమి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు. ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయినప్పటికీ ఇళ్ల స్థలాల విషయంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం మినహా ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో చర్యలు జరగలేదని నాయకులు పేర్కొన్నారు. 2018–19లో ఎన్నికల ముందు ప్రకటించిన హౌసింగ్ పథకాన్ని కూడా ఆచరణలోకి తీసుకురావాలని కోరారు. జర్నలిస్టులు వృత్తి ద్వారా సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించి, వారికి తగిన వేతనాలు లేదా ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ లేని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గౌరవప్రదమైన విశ్రాంత జీవితానికి వీలుగా ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న తరహాలో పాత్రికేయ పింఛను పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రారంభించాలన్నారు. జర్నలిస్టులపై పెరుగుతున్న భౌతిక దాడులు, బెదిరింపులను అరికట్టేందుకు రాష్ట్రంలో జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలన్నారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, భద్రత కోసం సంఘటితంగా పోరాడుతూ సమస్యల పరిష్కారం సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు.
Admin
E Nivas News