ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లా, పాములపాడులోని, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో మిట్టకందాల గ్రామంలో దళితులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీడీవో- ఎన్.చంద్రశేఖర్, డిప్యూటీ తహాసిల్దార్-పఠాన్ బాబు లకు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు గ్రామస్తులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డీవీఎంసీ మెంబర్ లింగాల.నాగరాజు మండల అధికారులతో మాట్లాడుతూ పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామంలో సర్వేనెంబర్ 504లో ప్రభుత్వ భూమి 104 ఎకరాల భూమిలో ఎస్సీ దళితులు దాదాపుగా 50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారని అయితే ఇంతవరకు పట్టాలు మంజూరు చెయ్యలేదని ఆయన అన్నారు. పట్టాలు మంజూరు చేయనందున రైతు భరోసా క్రాప్ లోన్ తీసుకునే అవకాశం లేదని రైతులు నష్టపోతున్నారని ఆయన అన్నారు. ఇలాంటి భూ సమస్యల కోసం ప్రభుత్వం రి సర్వే పేరు మీద నిజమైన వ్యవసాయ దారులు ఎవరైతే ఉన్నారో రి సర్వే ప్రకారం వారి పేర్లు పొందపరచి ఎలాంటి తప్పు ఒప్పులు లేకుండా చూసి పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే మిట్టకందాల గ్రామంలో రీ సర్వే జరిగి నాలుగు నెలలవుతున్న ఇంతవరకు లబ్ధిదారుల పేర్లు విస్తీర్ణం తెలియజేయడం లేదని వెంటనే సాగు చేసుకుంటున్న లబ్ధిదారులకు వెంటనే పట్టాలు మంజూరు చేసి వారిని ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మిట్టకందాల గ్రామ ప్రజలు, తదితర ప్రజాసంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News