ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్కాలాంబ, నేషనల్ మహిళా కాంగ్రెస్ ఇంచార్జి అతిధి, నేషనల్ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కమలాక్షి,, ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ అమర్జహా బేగ్ ల ఆదేశాల మేరకు ఈరోజు నందికొట్కూరు నియోజవర్గంలోని, జూపాడుబంగ్లా లో నియోజవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం ఆధ్వర్యంలో మహిళలతో కలిసి పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టడం జరిగింది. కేంద్రంలోని, బీజేపీ ప్రభుత్వం మహిళల సాధికారత గురించి గొప్పలు చెప్పుకుంటూ, ఆచరణలో మాత్రం మహిళలను తప్పుదోవ పట్టిస్తూ మోసం చేస్తోందని నందికొట్కూరు నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షేక్.షాజహాన్ బేగం విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ జనాభాలో మహిళలు దాదాపు సగం ఉన్నప్పటికీ, వారికి రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపడం లేదన్నారు. ప్రస్తుతం లోక్సభలో ఉన్న 543 స్థానాల్లోనే మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేలా వెంటనే చట్టం తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ అంశాన్ని పార్లమెంట్ స్థానాల పునర్విభజన (డిలిమిటేషన్)తో ముడిపెట్టడం పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆమె ఆరోపించారు. మహిళలకు నిజంగా న్యాయం చేయాలనే సంకల్పం ఉంటే, స్థానాల సంఖ్య పెరిగే వరకు వేచి ఉండకుండా ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాల్లోనే మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళా సాధికారత పేరుతో ప్రచారం చేయడం ఒకవైపు, అమలును నిరవధికంగా వాయిదా వేయడం మరోవైపు జరుగుతోందని ఆమె విమర్శించారు. మహిళల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, మహిళలకు సమాన రాజకీయ అవకాశాలు కల్పించడంలో ఎలాంటి ఆలస్యం చేయకూడదని పేర్కొన్నారు. మహిళలకు సమాన హక్కులు, సమాన ప్రాతినిధ్యం కల్పించడం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని, అందుకే కేంద్ర ప్రభుత్వం వెంటనే మహిళలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ అమలు చేసేలా చట్టపరమైన చర్యలు చేపట్టాలని షేక్.షాజహాన్ బేగం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News