ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : రహదారి నిబంధనలు పాటించడం ద్వారానే ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం ఆత్మకూరు ఎంవీఐ కార్యాలయం దగ్గర, ఆయన పాఠశాల బస్సు డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఆయన స్వయంగా డ్రైవర్లకు పలు వాహన చోదన మెళకువలను వివరిస్తూ, వారికి అవగాహన కల్పించారు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం డ్రైవర్లు పాటించాల్సిన కీలక నిబంధనలను స్పష్టం చేశారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ ప్రతి పాఠశాల బస్సుకూ తప్పనిసరిగా ఫిట్నెస్ ఉండాలన్నారు. కండిషన్ లేని వాహనాలు రోడ్డెక్కితే కఠిన చర్యలు తప్పవు అన్నారు. స్కూల్ బస్సు నడిపే డ్రైవర్లకు కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలనీ మరియు వారు హెవీ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. వాహన సామర్థ్యం (సీటింగ్ కెపాసిటీ) కంటే ఒక్క విద్యార్థిని కూడా అదనంగా ఎక్కించకూడదన్నారు. విద్యాసంస్థల వాహనాలకు కచ్చితంగా 'స్పీడ్ గవర్నర్స్' అమర్చి ఉండాలనీ, వేగం పరిమితి దాటకూడదన్నారు. వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ మరియు అగ్నిమాపక పరికరాలు (ఫైర్ ఎక్సటింగుషర్స్) పని చేసే స్థితిలో ఉండాలని, వారోత్సవాల సందర్భంగా ఎంవీఐ డ్రైవర్ల సందేహాలను నివృత్తి చేస్తూ, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన తక్షణ జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. డ్రైవర్లు డ్యూటీలో ఉన్నప్పుడు యూనిఫామ్ ధరించాలని, పిల్లలు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. అజాగ్రత్తగా వాహనాలు నడిపి నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు చేయడమే కాకుండా, యాజమాన్యాలపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Admin
E Nivas News