ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు మండలం పరిధిలోని, మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల, రహమత్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (మెగా పిటిఎం 4.0) కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి సయ్యదా పర్వీన్ బాను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ షాహినాజ్, ప్రత్యేక అధికారి ఏ.వి. రమణ, ఏవో, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు ఖాజా, రఫీక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు, పిఆర్టియు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష మాట్లాడుతూ మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ నిర్వహణ ఉద్దేశాన్ని తల్లిదండ్రులకు వివరించారు. విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత వల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగి, అడ్మిషన్లు కూడా అధికమవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కానుకలు, తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, జిఎఫ్ఎల్ఎల్ లీప్ యాప్ వంటి కార్యక్రమాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అలాగే పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, విద్యార్థుల అభ్యాస పురోగతికి తల్లిదండ్రులు ఇంటి వద్ద చేపట్టాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ముబీన్ పర్వీన్, బషీర్ అహ్మద్, యస్మీన్, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News