ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వము వెంటనే పరిష్కరించాలని వెలుగోడు జర్నలిస్టులు సోమవారము స్థానిక తహసిల్దార్ శ్రీనివాసులు గౌడ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎ.పి. యూనియన్ ఆఫ్ వర్కింగు జర్నలిస్ట్స్ 70 వ ఏట ప్రవేశించడం తెలుగు పత్రికా రంగ చరిత్రలో ఒక గర్వకారణమైన ఘట్టంగా అన్నారు. 2026 ఆగస్ట్ 17 వ తేదీ నుండి ఏడాది పొడవునా ప్లాటినం జూబిలీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి మా యూనియన్ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిందన్నారు. ప్లాటినం జూబిలీ ఉత్సవాల ప్రారంభం సందర్భంగా మాయూనియన్ పోరాట సంప్రదాయాన్ని అనుసరించి వర్కింగ్ జర్నలిస్టు పెండింగు సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. వర్కింగ్ జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలన్నారు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ అమలులో నెట్ వర్క్ ఆస్పత్రులలో ఎదురవు తున్న ఇబ్బందుల వల్ల పలువురు జర్నలిస్టులు ఆరోగ్య ప్రయోజనాలు పొందలేక పోతున్నారని ,ప్రభుత్వం నుండి బకాయిలు ఉన్నాయన్న పేరుతో నెట్ వర్క్ ఆస్పత్రులలో హెల్త్ కార్డును చాలా సందర్భాల్లో అనుమతించుట లేదన్నారు కొన్ని ప్రాసెస్ లకు కూడా కార్డు వర్తించుట లేదని, ఇటువంటి లోటుపాట్లను సవరించి జర్నలిస్టుల హెల్త్ కార్డును మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని కోరుతున్నామన్నారు. పథకం అమల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సమాచార శాఖ, ఎన్టీఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో ఒక త్రైపాక్షిక పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనీ, తద్వారా జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇస్తామని కూటమి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయ్యినా, ఇప్పటివరకూ ఈ విషయమై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం మినహా ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు.2018-19 లో ఎన్నికల ముందు ప్రకటించిన హౌసింగ్ పథకం ఆచరణలో అమలుకు నోచుకోలేదు. అందువల్ల మరింత జాప్యం లేకుండా ఇళ్ల స్థలాల విషయమై సత్వర చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. జర్నలిస్టులు వృత్తి ద్వారా సమాజానికి చేసిన సేవలను, వారికి తగిన వేతనాలు గానీ, ఉద్యోగ విరమణ పింఛను గానీ, లేని పరిస్థితులను, వారి వయసును దృష్టిలో ఉంచుకుని విశ్రాంత జీవితాన్ని గౌరవప్రదంగా గడపడానికి వీలుగా పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పాత్రికేయ పింఛను పథకాన్ని మన రాష్ట్రంలో కూడా ప్రారంభించాలని కోరుతున్నామన్నారు. జర్నలిస్టులపై పెరిగిపోతున్న భౌతిక దాడులు, బెదిరింపులు, దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో జర్నలిస్టుల భద్రతకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో వెలుగోడు జర్నలిస్టులు రఘు రాముడు, చంద్ర శేఖర్ గుప్తా, రాఘవేంద్ర, షాబీర్ హుస్సేన్, లింకన్ రాజు, శివశంకర్, నాజిర్ పాల్గొన్నారు.
Admin
E Nivas News