ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : జిల్లాలో వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులకు ఖర్చులకు అనుగుణంగా పంట రుణాల మంజూరుకు మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనల్లో రైతులు కీలక భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్(కెడిసిసి) ఎన్టీఆర్ జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్ లోని, ఎవిఎన్రెడ్డి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, ప్రగతిశీల రైతులు, బ్యాంకర్లు తదితరులు హాజరయ్యారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ పంటలకు ఎకరా విస్తీర్ణానికి రుణ పరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్)పై ప్రతిపాదనల రూపకల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఎకరానికి మిరప పంటకు 1లక్ష 20 వేలు పత్తి పంటకు 60 వేలు, వరి పంటకు 46 వేలు, మొక్కజోన్నకు 45 వేల చొప్పున రుణాలను మంజూరు చేయాలని అనంతవరంకు చెందిన ప్రగతిశీల రైతులు కె.నరసింహారావు కలెక్టర్ ను కోరారు. గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో వివిధ పంటల సాగు వ్యయం, పంట దిగుబడి విలువ, రుణ పరిమితి వివరాలను పరిశీలించి.. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో సాగు ఖర్చు, దిగుబడి విలువ అంచనాల ఆధారంగా నిర్ణయించాల్సిన రుణ పరిమితిపై వ్యవసాయం, ఉద్యాన, మత్స్య, తదితర శాఖల అధికారులు తమ అభిప్రాయాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. రైతులకు వివిధ పంటల సాగుకు సంబంధించి విత్తనాలు, ఎరుపులు, పురుగు మందుల కొనుగోలు, పంట కోతల వరకు అయ్యే ఖర్చుల వివరాలను తెలియజేశారు. దీనిపై కలెక్టర్ లక్ష్మీశ స్పందిస్తూ పైన పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకొని జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ ద్వారా 2026-27కు గాను రైతులకు వరి, ఎడిమిర్చి, పచ్చిమిర్చి, మామిడి, అయిల్పామ్, వేరుశనగ, పత్తి, వంటి పంటలతో పాటు పట్టు పురుగుల చేపలు రోయ్యలు పెంపకం దారులు మత్సకారులకు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు గాను రుణ పరిమితిని ప్రతిపాదించడం జరిగిందన్నారు. రైతుల ప్రయోజనాలను సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గతేడాది కంటే రుణపరిమితిని పెంచడం జరిగిందన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (రుణ పరిమితికి అదనంగా 30 శాతం వరకు బ్యాంకులు రుణాలు మంజూరు చేసే అవకాశముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, అనుబంధ రంగాల రైతుల సంక్షేమానికి అమలుచేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకుల ద్వారా అందించే రుణాలపై రైతులలో అవగాహన కల్పించి సాధ్యమైనంత మేరకు రైతులు బుణాలను పొందేలా కృషి చేయాలని ప్రగతిశీల రైతులకు జిల్లా కలక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. ఈ సమావేశంలో కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ సిఈఓ ఎ. శ్యామ్ మనోహర్, జిఎం ఎ. రంగబాబు, ఎల్డీఎం ఎం.ప్రియాంక, జిల్లా వ్యవసాయ అధికారి డిఎంఎఫ్.విజయకుమారి, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, మత్య్స శాఖ అధికారి డిడి.చక్రాణి, జిల్లా పశువర్ధక శాఖ అదికారి ఎం.హనుమంతరావు, ప్రగతిశీల రైతులు కె.నరసింహారావు, పి.నాగేశ్వరరావు, ఎ.అజయ్ కుమార్, తదితర బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News