ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : జూపాడుబంగ్లా మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలని సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. జూపాడుబంగ్లా కు చెందిన కౌలు రైతు రవీంద్ర 5 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట వర్షాభావంతో పూర్తిగా దెబ్బతిన్నది. చేతికి వచ్చే దశలో ఉన్న పంట ఎండిపోవడంతో చివరకు ట్రాక్టర్తో దున్నవలసి వచ్చినదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి పంట నష్టాన్ని పరిశీలించిన అనంతరం పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో తక్కువ వర్షపాతం కారణంగా జూపాడుబంగ్లా మండలంలోని రైతులు సాగు చేసిన మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, మినుము, కంది తదితర పంటలు నష్టపోయాయని తెలిపారు. నంద్యాల జిల్లాలో వేలాది ఎకరాల్లో రైతులు, కౌలు రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్తో సంబంధం లేకుండా ఎకరాకు రూ.40 వేల పరిహారం ఇవ్వాలని, రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, రుణాలను రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. రబీ సీజన్కు విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలని, 60 ఏళ్లు దాటిన రైతులు, కౌలు రైతులకు నెలకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. డిమాండ్లు పరిష్కరించకపోతే రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జూపాడుబంగ్లా మండల కార్యదర్శి ఈ.నరసింహుడు, నందికొట్కూరు మండల కార్యదర్శి సామన్న, పగిడ్యాల మండల కార్యదర్శి గుంపుల త్యాగరాజు, కౌలు రైతు రవీంద్ర, మనోహర్, శరత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News