ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లా, మండల కేంద్రమైన పాములపాడులోని, ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాలను రాష్ట్ర పీఎంశ్రీ అధికారి పి.వెంకటేశ్వరరావు, ఏఎంఓ వి.మాధవి లత ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల అసెంబ్లీలో విద్యార్థులను ఉద్దేశించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిశుభ్రత, ఆరోగ్యకరమైన జీవన విధానం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, పాఠశాలలో లభిస్తున్న సౌకర్యాల గురించి విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అందిస్తున్న భోజనం, తాగునీరు మరియు ఇతర సౌకర్యాలు అత్యంత సంతృప్తికరంగా ఉన్నాయని విద్యార్థులు తెలియజేశారు. అనంతరం అధికారులు పాఠశాలలోని, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ ప్రయోగశాలలు, అటల్ టింకరింగ్ ల్యాబ్, బీటీ వెల్నెస్ కేంద్రం, గ్రంథాలయం, ఐటీ విభాగం, ఫిజికల్ ఎడ్యుకేషన్ గదులను, తదితర విభాగాలను సందర్శించి, సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని విభాగాలు సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయని, రికార్డులు పద్ధతిగా, సక్రమంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పీఎంశ్రీ అధికారి పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పాములపాడు ఏపీ మోడల్ స్కూల్కు రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ఉందన్నారు.
ఆ ప్రతిష్ఠను మరింతగా నిలబెట్టుకుంటూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, అత్యుత్తమ ఫలితాలను అందించాలని సూచించారు. ఈ తనిఖీ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ వి.నాగ రవీంద్ర అధికారులు వెంట ఉండి, పాఠశాలలో అమలవుతున్న విద్యా కార్యక్రమాలు, మౌలిక సౌకర్యాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను గురించి వివరించారు.
Admin
E Nivas News