ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : శ్రీకాకుళం జిల్లా సమాచార & పౌర సంబంధాల శాఖలో పనిచేస్తున్న ఏడి చెన్నకేశవుల వ్యవహార శైలిని నిరసిస్తూ స్థానిక పత్రికల ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు శ్రీకాకుళం ప్రెస్ క్లబ్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ జిల్లా డీపీఆర్ఓ కార్యాలయం జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోవడం లేదని, ముఖ్యంగా అక్రిడేషన్ కార్డుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన గుర్తింపు, సహకారం, సమాచారంలో నిర్లక్ష్యం కొనసాగుతోందని వారు ఆరోపించారు. ఇటీవల జరిగిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం వంటి ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ కార్యక్రమానికి స్థానిక జర్నలిస్టులకు తగిన ఆహ్వానాలు అందించకపోవడం, మీడియా కవరేజ్కు అవసరమైన ఏర్పాట్లు చేయకపోవడం పట్ల సమావేశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఈ విషయంలో సంబంధిత అధికారుల వైఫల్యంపై పలువురు జర్నలిస్టులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశంలో పాల్గొన్న పలువురు, జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఏడి చెన్నకేశవులపై ప్రభుత్వం వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టులకు పెండింగ్లో ఉన్న అక్రిడేషన్లను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టుల పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు, దురుసు ప్రవర్తన సహించబోమని సమావేశంలో పలువురు నాయకులు పేర్కొన్నారు. పరిస్థితిలో మార్పు రాకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన వార్తల ప్రచురణపై సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు ఎన్. ఈశ్వరరావు, పేడాడ శ్యాంసుందర్, ఎం.వి. మల్లేశ్వరరావు, గురిగిబిల్లి నాగభూషణ్, డా. డోల.అప్పన్న, బొడ్డేపల్లి రాజేష్, ఆకుల మాధవ, గోండు జనార్దన్రావు, కళ్యాణ్ పెద్దకోట, కొంచెం చిన్నారావు, రాము, సింగూరు శ్రీనివాసరావు, బొడ్డ కృష్ణారావు, జిల్లా వాణి ఈశ్వరరావు, పొడుగు రాజు, అద్దంకి సురేష్, బద్రి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. (ఆదివారం) ఉదయం 10:00 గంటలకు శ్రీకాకుళం ప్రెస్ క్లబ్లో జరగనున్న అత్యవసర సమావేశానికి జర్నలిస్టులు, స్థానిక పత్రికల ప్రతినిధులు అందరూ తప్పనిసరిగా హాజరై ఐక్యతను చాటాలని సమావేశ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
Admin
E Nivas News