ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణం రవాణా శాఖ సేవలను పొందే ప్రతి వాహనదారుడు ప్రభుత్వ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, తద్వారా సురక్షితమైన ప్రయాణాన్ని సాగించాలని ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవిఐ) సత్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నిర్వహించిన సమీక్షా సమావేశం నేపథ్యంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దళారుల ప్రమేయం లేకుండా ఆన్లైన్ సేవలను పొందాలన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రవాణా శాఖ సేవలను పూర్తి పారదర్శకంగా మారుస్తున్నట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు లేదా ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం దళారులను ఆశ్రయించి అదనపు సొమ్ము చెల్లించవద్దని, ప్రభుత్వం నిర్దేశించిన చలానా రుసుమును మాత్రమే ఆన్లైన్ ద్వారా చెల్లించి సేవలు పొందాలని సూచించారు. ఈ సందర్భంగా వాహనదారులకు ఎంవీఐ-సత్యనారాయణ రెడ్డి కీలక సూచనలు చేశారు. నకిలీ పత్రాల పట్ల జాగ్రత్త: ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్లు గుర్తింపు పొందిన కేంద్రాల్లోనే తీసుకోవాలన్నారు. నకిలీ పత్రాలతో పట్టుబడితే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అధిక లోడింగ్ నివారణ: ఆటోలు, లారీలు పరిమితికి మించి ప్రయాణికులను లేదా సరుకును రవాణా చేయకూడదు. అధిక లోడింగ్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. రోడ్డు భద్రత: వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం నేరం. సకాలంలో ట్యాక్స్ చెల్లింపు: ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాహన పన్నులను సకాలంలో చెల్లించి జరిమానాల నుండి తప్పించుకోవాలి. నంద్యాల జిల్లా కలెక్టర్- జి.రాజకుమారి గణియా ఆదేశాల మేరకు రవాణా శాఖను కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో 'ఎ' గ్రేడ్లో నిలబెట్టేందుకు ప్రతి వాహనదారుడు సహకరించాలని ఆయన కోరారు. ఇకపై నిబంధనలు అతిక్రమించే వాహనాలపై ప్రత్యేక బృందాలతో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంవీఐ- సత్యనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
Admin
E Nivas News